Chinese Military Planes : యుద్థవిమానాలతో తైవాన్ పై మరోసారి చైనా బలప్రయోగం

తైవాన్​ పై మరోసారి బలప్రదర్శనకు దిగింది చైనా. బలవంతంగానైనా తైవాను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా..ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలలుగా

Chinese Military Planes :  యుద్థవిమానాలతో తైవాన్ పై మరోసారి చైనా బలప్రయోగం

Taiwan

Chinese Military Planes :  తైవాన్​ పై మరోసారి బలప్రదర్శనకు దిగింది చైనా. బలవంతంగానైనా తైవాను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా..ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలలుగా తైవాన్ గగనతలంలోకి పెద్ద ఎత్తున యుద్ధవిమనాలు పంపుతున్న డ్రాగన్..శుక్రవారం(డిసెంబర్-10,2021) మరోసారి 13 యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది.

రెండు హెచ్-6 బాంబర్లు,ఒక Y-8 ఎలక్ట్రానిక్ వార్​ఫేర్ విమానం,ఒక యాంటీ సబ్ మెరైన్ యుద్ధ విమానం,ఒక KJ-500 థర్డ్ జనరేషన్ విమానం,ఆరు షెన్యాంగ్ -16 ఫైటర్ జెట్స్,రెండు చెంగ్డూ J-10 ఫైటర్ జెట్స్ శుక్రవారం తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్​లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చైనాకు దీటుగా తైవాన్ వాయుసేన సైతం యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపించిందని రక్షణ శాఖ తెలిపింది. చైనా విమానాలను హెచ్చరించేలా రేడియో సంకేతాలు పంపినట్లు తెలిపింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను సైతం రంగంలోకి దించినట్లు తెలిపింది. అయితే ఆఫ్రికా దేశమైన నికరాగువా తైవాన్​తో దౌత్య సంబంధాలు తెంచుకున్న రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.

చైనా-తైవాన్..ముఖ్య విషయాలు
దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1949లో జరిగిన సివిల్ వార్ సమయంలో చైనా-తైవాన్ లు విడిపోయాయి. అయితే ఏదోఒకరోజు అవసరమైతే ఒలవంతంగానైనా తైవాన్ ను మళ్లీ పూర్తీగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చైనా చెబుతోంది. తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు.

తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ వివాదంలో అమెరికా కూడా కల్పించుకునే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక,1980లో చైనీ-తైవాన్ మధ్య సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే ‘ఒక దేశం- రెండు వ్యవస్థల’ సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే, ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చేసిన ప్రతిపాదనకు తైవాన్ అంగీకరించలేదు.

తైవాన్ ను ఎవరు గుర్తిస్తున్నారు?
కేవలం కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ ను ఓ దేశంగా గుర్తిచాయి. అగ్రరాజ్యం అమెరికాకు తైవాన్‌తో అధికారిక సంబంధాలు లేవు కానీ ఆ దేశానికి తనను తాను రక్షించుకునే మార్గాలను అందించే చట్టాన్ని కలిగి ఉంది.

అసలు వివాదం ఎలా మొదలైంది?

తైవాన్ లో మొదట చైనా నుంచి వలస వెళ్లిన “ఆస్ట్రోనేసియన్” గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు. క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించినట్లు చైనా రికార్డులను చూపెడుతోంది. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది. 1624-1661 మధ్య డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తర్వాత 200 ఏళ్లకు పైగా(1683-1895) చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది. 17వ శతాబ్దం మొదట్లో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రాల ప్రజలు తైవాన్‌ కు పెద్ద సంఖ్యలో సంఖ్యలో వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారి వారసులే.

1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తైవాన్.. జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్‌ పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, బ్రిటన్ దేశాల అనుమతితో తైవాన్‌ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది. కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో 1949లో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వెళ్లిపోయారు. తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే అయినా, చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు. చనిపోయేవరకు షియాంగ్‌ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది.

తైవాన్ లో ఇప్పుడు ప్రభుత్వం ఎలా నిర్వహించబడుతోంది?
తైవాన్ కు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేతలు ఉన్నారు. తైవాన్ సాయుధ బలగాల్లో.. 3లక్షల యాక్టివ్ ట్రూప్స్ ఉన్నాయి.

తైవాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడిని హెచ్చరించిన జిన్ పింగ్
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో జరిగిన వర్చువల్ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ…”తైవాన్ అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం”అని హెచ్చరించారు.