Putian : కరోనా ఉధృతి..చైనాలోని ఆ సిటీలో రైళ్లు,బస్సులు బంద్
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
Putian ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. ఇక మొదటిసారిగా వైరస్ వెలుగులోకివచ్చిన చైనాలో మళ్లీ కరోనా కలవరం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వైరస్ వ్యాప్తిని నిలువరించామని ప్రకటించిన ఆ దేశంలో డెల్టా వేరియంట్ ఉద్ధృతితో వివిధ నగరాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
దక్షిణ చైనాలోని ఫుజియాన్ రాష్ట్రంలోని పుతియాన్ నగరంలో కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పుతియాన్లో శనివారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఫుజియాన్ రాష్ట్రంలోని మరో నగరమైన క్వాన్జోవులో ఒక కేసు నమోదైనట్లు పేర్కొంది. షియాన్హు కౌంటీ నుంచి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా.. పుతియాన్లో కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పుతియాన్ నగరంలో సినిమా హాళ్లు, జిమ్లు, పర్యాటక ప్రదేశాలతో పాటు జనం గుమికూడే అన్ని రకాల ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు.. నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించవచ్చని తెలిపారు. ప్రజలెవరూ నగరం దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
బస్సు, రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వెళ్లేవారు 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్గా తేలిన సర్టిఫికెట్ చూపించాలని స్పష్టం చేశారు. పుతియాన్లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్లు చైనా ఎన్హెచ్సీ తెలిపింది.