ఇంటి నుంచి బయటకొస్తే కరోనా పాజిటివ్, ఈ దేశానికి ఎందుకొచ్చాం దేవుడా.. అమెరికాలో భారతీయుల హాహాకారాలు

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4

  • Published By: veegamteam ,Published On : April 8, 2020 / 03:52 AM IST
ఇంటి నుంచి బయటకొస్తే కరోనా పాజిటివ్, ఈ దేశానికి ఎందుకొచ్చాం దేవుడా.. అమెరికాలో భారతీయుల హాహాకారాలు

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 12వేల మంది మరణించారు. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దీంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇక అమెరికాలో ఉంటున్న భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాణ భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగువారు హాహాకారాలు పెడుతున్నారు.

అమెరికాలో కరోనాతో 100మంది భారతీయులు మృత్యువాత:
అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టే సాహసం కూడా చేయడం లేదు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 100 మంది దాకా అమెరికాలో ఉంటున్న భారత జాతీయులు కరోనా బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలోని భారత సంఘాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారే అందులో ఎక్కువగా ఉన్నారని, న్యూజెర్సీకి చెందిన ఓ పాతిక మంది దాకా ప్రాణాలు విడిచారని తెలుస్తోందన్నారు. 

దిక్కుతోచని స్థితిలో భారతీయుల కుటుంబాలు:
అమెరికాలో సీనియర్‌ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.

వారం సరుకులు నెల రోజులు సర్దుకోవాల్సిన దుస్థితి:
న్యూజెర్సీలో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను నెల రోజులు వాడకునేందుకు వీలుగా పొదుపు చేసుకుంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కమ్యూనిటీలుగా ఏర్పడి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ‘రోజూ నలుగురో ఐదుగురో కరోనా బారిన పడుతున్నారు. వారికి సాయం చేసే స్థితిలో లేకపోవడం మాకు శోకాన్నే మిగులుస్తోంది. పిల్లలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఈ దేశానికి ఎందుకు వచ్చాం దేవుడా అని రోజుకు పది సార్లు అనుకోవాల్సి వస్తోందని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న తెలుగువాళ్లు వాపోయారు. న్యూజెర్సీలోని హడ్సన్‌ కౌంటీలో దాదాపు 50 వేల మంది భారతీయులు ఉండగా వారిలోనూ 25 నుంచి 30 వేల మంది తెలుగు వారే.(ఉన్మాదం.. యువతిపై ఉమ్మేసి పారిపోయిన యువకుడు, కరోనా సోకుతుందేమోనని భయం)

నిత్యావసరాల కోసం ఇంటి నుంచి బయటకొచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్:
అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్జిన్‌ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు సైతం కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ‘గత శుక్రవారం నేనూ, మా కమ్యూనిటీలోఉండే మరో నలుగురం వేర్వేరు కార్లలో కాస్ట్‌కోకు వెళ్లాం. అక్కడి నుంచే మరో ఇండియన్‌ స్టోర్‌కు కూడా వెళ్లాం. మేమంతా ఇప్పుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాం. మా ఐదుగురిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన ఇద్దరం ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నాము’ అని విశాఖకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ కరోనా పంజా:
భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కళ్ల ముందే అనేక మంది కరోనా బారిన పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలుగు వారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. భారతీయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్, న్యూయార్క్‌ మెట్రోపాలిటన్, మేరీల్యాండ్‌కు చెందిన అనేక మంది కమ్యూనిటీ లీడర్లు సైతం కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ వారి ఇళ్లలోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. హూస్టన్‌కు చెందిన భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రోహన్‌ బవదేకర్‌ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఆయన చికిత్స కోసం స్నేహితులు 2.04 లక్షల డాలర్లను సేకరించారు. మియామీలోని కార్డియాక్‌ ప్రివెంటివ్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముకుల్‌ ఎస్‌.చంద్ర వెంటిలేటర్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన మృత్యువు నుంచి బయటపడేందుకు ప్లాస్మా దోనర్‌ కోసం వాట్సాప్‌ గ్రూపుల్లో వినతులు చేస్తున్నారు.  

* ప్రపంచంలో 209కి చేరిన కరోనా ప్రభావిత దేశాల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా 14లక్షల 30వేల కరోనా కేసులు.. 81వేల 715 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షలు
* అత్యధికంగా అమెరికా, స్పెయిన్, ఇటలీలో కేసులు నమోదు
* యూరప్ దేశాల్లో కరోనా పంజా
* బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలు

* అమెరికాలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు, 12వేల 716 మరణాలు
* స్పెయిన్ లో లక్షా 40వేల కేసులు, 14వేలకు పైగా మరణాలు
* ఇటలీలో లక్షా 30వేల కేసులు, 17వేలకు పైగా మరణాలు
* ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజే 1,417 మంది, అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,845 మంది మరణం
* అమెరికాలో నిన్న ఒక్కరోజే 27వేలకుపైగా కేసులు నమోదు

* భారత దేశంలో 5వేలు దాటిన కరోనా కేసులు, 169 మరణాలు
* కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 463 మంది
* అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో కరోనా కేసులు నమోదు
* మహారాష్ట్రలో 1018 కేసులు, 64 మరణాలు
* కేరళలో 336 కేసులు, రెండు మరణాలు
* తెలంగాణలో 404 కరోనా కేసులు, 11 మరణాలు
* తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 45
* ఏపీలో 314 కరోనా కేసులు