IRAN Morality Police : ఇరాన్లో హిజాబ్ చట్టంలో మార్పులు చేస్తారా? పూర్తిగా రద్దు చేస్తారా? పార్లమెంట్, న్యాయవ్యవస్థల కసరత్తులు
రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్ ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. మోరల్ పోలీస్ విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం లేదని.. దాన్ని రద్దు చేశామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు ఆ దేశానికి చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. హిజాబ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థలు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ ఏజీ వెల్లడించిన మరుసటిరోజే ఈ ప్రకటన వెలువడింది.

IRAN Morality Police : జనమంతా ఏకమైతే డిక్టేటర్లు కూడా ఏం చేయలేరని మరోసారి తేలింది. మహిళలంతా తమ హక్కుల కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడితే ఎంతటి నియంతృత్వ ప్రభుత్వం అయినా దిగిరావాల్సిందేనని నిరూపితమైంది. రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్ ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. మోరల్ పోలీస్ విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం లేదని.. దాన్ని రద్దు చేశామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు ఆ దేశానికి చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. హిజాబ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థలు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ ఏజీ వెల్లడించిన మరుసటిరోజే ఈ ప్రకటన వెలువడింది.
హిజాబ్కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు సాగించిన గొప్ప పోరాటానికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి. పోలీసుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు, బేనర్లు చేతబట్టి.. నడిరోడ్లపై హిజాబ్లు తగులబెడుతూ, జడలు కత్తిరించుకొన్న అతివల పోరాటం ఫలించింది. ఈ ఏడాది సెప్టెంబరులో అమీని అనే యువతి హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి మొరాలిటీ డిపార్ట్మెంట్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వారి కస్టడీలో ఉండగానే.. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ అమీని మరణించింది. దాంతో దేశంలో సెప్టెంబర్ 17న ప్రజా నిరసనలు మొదలయ్యాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. క్రమంగా అవి ఉధృతంగా మారి.. రాజధాని టెహ్రాన్తో సహా దేశవ్యాప్తంగా పలు నగరాలకు వ్యాపించాయి. పోలీస్ బలగాల కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. ఇప్పటిదాకా 448 మంది ప్రాణాలో కోల్పోయారు. అయినప్పటికీ ప్రజా విప్లమం మాత్రం ఆగలేదు సరికదా.. మరింత ఉధృతరూపం దాల్చింది. అమినీ పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలంతా రోడ్ల మీదకు వచ్చి హిజాబ్లను కాలబెట్టారు. జుట్టు కత్తిరించుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిరసనలు తెలిపారు. పురుషులు కూడా పెద్దఎత్తున మద్దతు పలికారు. ఈ నిరసనల్ని అల్లర్లుగా ప్రకటించిన ప్రభుత్వం.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపింది. అయినా మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు పాకాయి.
మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా జరిగిన ఆందోళనల్లో 300 మందికి పైగా బలయ్యారని, పోలీసుల్లో కూడా పలువురు అల్లర్లలో చనిపోయారని ఇరాన్ సర్కార్ ప్రకటించింది. అయితే, సెక్యూరిటీ బలగాల చేతిలో 448 మంది నిరసనకారులు మరణించారని.. వీరిలో 64 మంది మైనర్లు ఉన్నారని ఓస్లోకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఇక రెండు నెలల్లో 18 వేల మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తప్పనిసరి హిజాబ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. ప్రెసిడెంట్ రైసీ మాత్రం ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు. దేశంలో అవినీతిని పెంచడం ద్వారా ఇస్లామిక్ విలువను నాశనం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని.. అల్లర్ల వెనక అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, కుర్దిష్ గ్రూపుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
ఇరాన్లో అమెరికా సపోర్ట్ ఉన్న రాచరిక ప్రభుత్వం 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్తో కూలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1983లో దేశంలో మహిళలు, పురుషులకు డ్రెస్ కోడ్ను విధించింది. 2005లో మహ్మద్ అహ్మదినెజాద్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గైడెన్స్ పెట్రోల్ పేరిట మోరాలిటీ పోలీస్ విభాగాన్ని నెలకొల్పారు. హిజాబ్ కల్చర్ను పరిరక్షించేందుకు 2006లో మోరాలిటీ పోలీస్ యూనిట్లను ప్రారంభించారు. మహిళలు హిజాబ్ లేకుండా బయటకు వచ్చినా.. షార్ట్ వేసుకున్నా, చిరుగుల జీన్స్ ధరించినా అరెస్ట్ చేసే అధికారం కట్టబెట్టారు. ఈ ఏడాది జులైలో ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. అప్పట్నుంచీ మొరాలిటీ పోలీస్ ఆగడాల్ని భరిస్తూ వచ్చారు ఇరాన్ మహిళలు. కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అది పూర్తిస్థాయి ఉద్యమంలా మారకుండా ప్రభుత్వం కట్టడి చేస్తూ వచ్చింది. కానీ.. రెణ్నెల్ల క్రితం అమినీ మృతితో అక్కడి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ప్రజా విప్లవంగా మారడంతో ప్రభుత్వ తలొంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొరాలిటీ పోలీసింగ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సంస్కరణలు ఇక్కడితోనే ఆగిపోతాయా? లేక హిజాబ్ చట్టంలో మార్పులు చేస్తారా.. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలన్న రూల్ను పూర్తిగా రద్దు చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.