Phosphorus Bombs : యుక్రెయిన్పై ఫాస్పరస్ బాంబులతో దాడి..? స్పందించిన రష్యా
యుక్రెయిన్పై దాడుల్లో భాగంగా ఫాస్పరస్ బాంబులు వినియోగించిందన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలపై రష్యా స్పందించింది.(Phosphorus Bombs)

Phosphorus Bombs
Phosphorus Bombs : నెల రోజులుగా యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ లో భారీ విధ్వంసమే సృష్టిస్తున్నాయి. యుక్రెయిన్ ప్రతిఘటించే కొద్దీ రష్యా దాడులు భీకరరూపు దాల్చుతున్నాయి. అధునాతన అస్త్రాలను సైతం యుక్రెయిన్ పై ప్రయోగిస్తోంది రష్యా. ఉక్రెయిన్పై పోరులో రష్యా తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాలను వాడుతోంది. ఇప్పటికే కింజల్ హైపర్సోనిక్ క్షిపణిని రెండు సార్లు వాడిన రష్యా.. తాజాగా కాలిబర్ దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైళ్లను రెండోసారి ప్రయోగించింది.
కాగా, దాడులను తీవ్రతరం చేసే క్రమంలో ప్రమాదకర రసాయనిక దాడులకు రష్యా దిగుతోందా? అంటే.. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అవుననే అంటున్నారు. యుక్రెయిన్ లో రష్యా ఫాస్ఫరస్ బాంబులు ప్రయోగిస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ దాడుల్లో భారీగా పెద్దవాళ్లు, చిన్నారులు బలైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.(Phosphorus Bombs)
ఉక్రెయిన్పై దాడుల్లో భాగంగా ఫాస్పరస్ బాంబులు వినియోగించిందన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలపై రష్యా స్పందించింది. జెలెన్ స్కీ ఆరోపణలను ఖండించింది. రష్యా ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. కాగా, పౌర ప్రాంతాల్లో వైట్ ఫాస్పరస్ బాంబుల వినియోగాన్ని అంతర్జాతీయ చట్టాలు నిషేధిస్తున్నాయి.
Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్పై రష్యా కొత్త అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైళ్ల ప్రయోగం
యుక్రెయిన్ పై పోరులో వైట్ ఫాస్పరస్ బాంబులను రష్యా వినియోగించిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన రేపాయి. రష్యా భీకర దాడులకు తెగబడుతోందని, రష్యాకు దీటుగా నాటో కూడా అదే రీతిలో స్పందించాలని జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో తనకంటే శక్తిమంతమైన కూటమి మరొకటి లేదని నాటో చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. నాటో ప్రతిస్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా యుక్రెయిన్ ఎంతో ఆశాభావంతో ఉందని జెలెన్ స్కీ అన్నారు.
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా సేనలు భారీగా నష్టపోతున్నాయి. వేల సంఖ్యలో రష్యన్ సైనికులు చనిపోతున్నారు. తాజాగా యుక్రెయిన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నాలుగు వారాలకుపైగా తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 16వేల 100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 53 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 5 నౌకలు, 49 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.
Ukrainian Army : యుక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన.. రష్యా యుద్ధాన్ని విరమించేది ఆ రోజే..?!