Russia-Ukraine war: యుక్రెయిన్ గగనతలం మూసివేత..ఖాళీగా వెనుదిరిగిన భారత విమానం..!
యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని తీసుకురావటానికి వెళ్లిన విమానం తిరిగి వచ్చేసింది. యుక్రెయిన్ గగనతలం మూసివేయటంతో ఖాళీగానే వెనుదిరిగింది భారత విమానం..
Air India flight AI1947 is coming back to Delhi : యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. బాంబులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే యుక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులు ఇండియాకు తిరిగి రావాలని భారత్ పలుమార్లు కోరింది. కొంతమంది వచ్చారు. కానీ ఇంకా చాలామంది అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత విద్యార్ధుల కోసం భారత్ విమానం నడుపుతోంది. ఈక్రమంలో ఉక్రెయిన్ తూర్పున ఉన్న నగరాల్లో గగనతలాన్ని మూసివేయించి తూర్పు యుక్రెయిన్ లోని ఎయిర్ పోర్టులను మూసివేసింది. అలాగే పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తూర్పు ఉక్రెయిన్లోని గగనతలాన్ని డేంజర్ జోన్గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్లోనే భారత్ సహా పలు దేశాల పౌరులు చిక్కుకుపోయారు.
భారతీయులను వెంటనే వెనక్కు వచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఉక్రెయిన్లోనే ఉన్నారు. వారిని తీసుకురావటానికి భారత్ విమాన సర్వీసుల్ని కొనసాగిస్తున్న క్రమంలో యుక్రెయిన్ లో గగనతలాన్ని మూసి వేయటంతో ఢిల్లీనుంచి యుక్రెయిన్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఖాళీగానే తిరిగి వచ్చేసింది.
గురువారం (ఫిబ్రవరి 24,2022) ఉదయం ఎయిర్ ఇండియా విమానం AI1947 భారతీయులను తీసుకురావడానికి ఉక్రెయిన్ వెళ్లగా ఆ దేశంలో అకస్మాత్తుగా అనుమతి దొరకకపోవడంతో తిరిగి న్యూఢిల్లీకి మళ్లింది. దీంతో ఉక్రెయిన్లోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీనుంచి విమానం బయలుదేరిన తరువాత యుక్రెయిన్ అధికారులు NOTAM (నోటీస్ టు ఎయిర్మెన్) జారీ చేశారు. ఇది ఉక్రెయిన్లోని పౌర విమానాల విమానాలు “పౌర విమానయానానికి సంభావ్య ప్రమాదం కారణంగా పరిమితం చేయబడ్డాయి” అని పేర్కొంది. దీంతో యుక్రెయిన్లోని కైవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి ఖాళీగానే చేరుకుంది.
కైవ్లో నోటామ్ జారీ అయినందున ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 1947 తిరిగి వస్తున్నట్లు ఎయిర్లైన్ ప్రతినిధి తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) నుండి కైవ్లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. గురువారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో కైవ్ నుంచి ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని ఓ అధికారి తెలిపారు.
దీంతో యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని సురక్షితంగా తీసుకురావటానికి గల మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. కానీ యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల గురించి తెలుసుకోవాటానికి అక్కడ ఉన్న భారత్ ఎంబసీ పనిచేస్తునే ఉంటుందని భారత్ వెల్లడించింది.