Amit Shah: మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరు.. ఆసక్తికరంగా స్పందించిన అమిత్ షా
Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలోని పలు నగరాలు, చారిత్రక నిర్మాణాల పేర్లు మార్చడంపై అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మొఘల్ పాలన నాటి గుర్తుల్ని చెరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శ చాలా బలంగా ఉంది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించగా, మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరని అంటూనే ఈ దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పనులు చేస్తుంటే ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని అన్నారు. మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన అహ్మదాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు. ఇది అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. ఇక ముఘల్ సరాయి రైల్వే స్టేషన్ పేరును సైతం దీన్ దయాల్ పేరుకు మార్చారు. ఇలా మరికొన్ని పేర్లు మారాయి. అయితే వీటిని గుర్తు చేస్తూ ‘‘మొఘల్ వారసత్వాన్ని చెరిపేయాలని అనుకుంటున్నారా?’’ అని అమిత్ షా ను ప్రశ్నించగా తాము ఏ నగరానికి కొత్త పేరు పెట్టలేదని, గతంలో ఉన్న పేరునే పునరుద్ధరించామని అన్నారు. ప్రతి ప్రభుత్వానికి చట్టబద్ధమైన హక్కులు ఉంటాయని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాగా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని అమిత్ షా అన్నారు.
Pulwama Attack: పుల్వామా నరమేధానికి నాలుగేళ్లు.. అత్యున్నత త్యాగమంటూ ప్రధాని మోదీ నివాళులు
ఇక కాంగ్రెస్ పార్టీని పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పార్టీతో పోల్చారనే ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు. తానెప్పుడూ అలా వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. అయితే పీఎఫ్ఐ సభ్యులపై అనేకమైన కేసులు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, తాను దాన్ని మాత్రమే వ్యతిరేకించానని అన్నారు. మతమార్పిడిలు చేయడం, విధ్వేషాలు రెచ్చగొట్టడం వంటి అనేక చట్టవ్యతిరేక పనులు పీఎఫ్ఐని విజయవంతంగా రద్దు చేశామని అమిత్ షా పేర్కొన్నారు.