Karnataka Election: 23మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. జగదీష్ షెట్టర్కు దక్కని చోటు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
Karnataka Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో .. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రెండు రోజుల క్రితం బీజేపీ కేంద్ర పార్టీ పెద్దలు విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాలో తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించింది. తాజాగా, బుధవారం రాత్రి రెండో విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 23మందితో ఈ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.
రెండవ జాబితాలో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉన్నారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 212 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 10మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 224 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మరో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, శుక్రవారం నాటికి మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
Karnataka Elections 2023: మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పను బీజేపీ ఇలా వాడుకుంటోంది: కాంగ్రెస్
ప్రముఖ నేత ఈశ్వరప్ప, మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ స్థానాలకు ఇంకా ఎవరి పేర్లను బీజేపీ అదిష్టానం ప్రకటించలేదు. కోలార్ గోల్డ్ఫీల్డ్స్ (కేజీఎఫ్) నుంచి బీజేపీ అభ్యర్థి షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి అశ్విని సంపంగి బరిలో ఉన్నారు. దావణగెర్తె నార్త్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కు టికెట్టు కట్ చేయడంతో పార్టీ ఆయన స్థానంలో లోకికెరె నాగరాజ్ ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత నాగరాజ చబ్చికల్ ఘట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Karnataka Polls: ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మాజీ సీఎం
మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ పేరును బీజేపీ అధిష్టానం రెండోజాబితాలోనూ ప్రకటించలేదు. బుధవారం ఢిల్లీకి వెళ్లి షెట్టర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం జగదీష్ షెట్టర్ వెల్లడించలేదు. రెండో జాబితాలో ఆయన పేరు వస్తుందని ఆయన వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రెండో జాబితాలోనూ జగదీష్ షెట్టర్ పేరు లేకపోవటం గమనార్హం.
The Central Election Committee of the BJP has decided the names of 23 candidates, in the second list, for the ensuing general elections to the legislative assembly of Karnataka. pic.twitter.com/0EXwgkapdO
— BJP (@BJP4India) April 12, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఫలితాలు మే 13న వెల్లడికానున్నాయి. అయితే, నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 13 నుంచి 20వరకు కొనసాగుతుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.