BJP: అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు: యూపీలో హింసపై బీజేపీ స్పందన
బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుందని పేర్కొంటూ ఆ పార్టీ నేత అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ వర్గం వారు ఆందోళన నిర్వహించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
BJP: బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుందని పేర్కొంటూ ఆ పార్టీ నేత అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ వర్గం వారు ఆందోళన నిర్వహించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ సింగ్ తమ పార్టీ తరఫున ఆదివారం ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ ఘటనకు సంబంధించిన ఏ విషయాన్నీ ఈ ప్రకటనలో అరుణ్ సింగ్ ప్రస్తావించలేదు. ఏ మతానికి చెందిన వారినైనా అవమానించేలా ఎవరు మాట్లాడినా బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అరుణ్ సింగ్ చెప్పారు. వేల సంవత్సరాల భారత చరిత్రలో ప్రతి మతం ఇక్కడ వికసించిందని ఆయన పేర్కొన్నారు. ఏ మతం, వర్గంలో వారినైనా కించపర్చేలా ఉండే భావజాలానికి తమ పార్టీ వ్యతిరేకమని ఆయన చెప్పారు. అటువంటి భావజాలం ఉన్నవారిని తమ పార్టీ ప్రోత్సహించదని పేర్కొన్నారు.
ఏ మతన్నయినా అనుసరించే హక్కును దేశంలోని ప్రతి పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిందని అరుణ్ సింగ్ చెప్పారు. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో దేశంలోని అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న ఉన్నతమైన ఆదర్శాలకు కట్టుబడి ఉన్నామని అరుణ్ సింగ్ పేర్కొన్నారు.