తెలంగాణకు మళ్లీ మిడతల దండు ముప్పు, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

  • Published By: naveen ,Published On : June 10, 2020 / 12:30 PM IST
తెలంగాణకు మళ్లీ మిడతల దండు ముప్పు, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణకు మళ్లీ మిడతల దండు ముప్పు పొంచి ఉందా? మిడతల దండు తెలంగాణపై దాడి చేయనుందా? ఏ క్షణమైనా మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించనుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అటు అధికారులను ఇటు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. మిడతలు రాకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఆ 8 జిల్లాల అధికారులను అలర్ట్ చేసిన సీఎం:
తెలంగాణలో వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలాంటి సమయంలో మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం జరుగుతుందన్నారు. లేత పంటను మిడతలు పీల్చి పారేస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. సరిహద్దుల్లో ఉన్న 8 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూన్ 20 నుంచి జూలై 5 వరకు మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిడతల దండు దక్షిణం వైపు నుంచి వస్తే తెలంగాణకు ముప్పు ఉందన్నారు. తెలంగాణలో మిడతల దండు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

ప్రత్యేక బృందం ఏర్పాటు:
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటీ రెండు రోజుల్లో ఆదిలాబాద్ లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తుంది. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తుంది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే:
మే నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ దగ్గర అజ్ని అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను సీఎం కేసీఆర్ బుధవారం(జూన్ 10,2020) ప్రగతి భవన్ లో సమీక్షించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది.