వ్యాక్సిన్ పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్

వ్యాక్సిన్ పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్

COVID-19 vaccination కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్​ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 34రోజుల్లోనే కోటి మార్కును దాటినట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపడుతోన్న దేశాల్లో అమెరికా ముందుండగా.. భారత్‌ రెండో స్థానంలో నిలిచినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అమెరికాలో కేవలం 31రోజుల్లోనే పౌరులకు.. కోటి వ్యాక్సిన్‌ డోసులను అందించారు.

కాగా, జనవరి-16,2021న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ.ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 65లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా, వీరిలో 4లక్షల మందికి రెండో డోసు అందించారు. వీరితో పాటు మరో 30లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కూడా టీకా‌ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక తొలి డోసు తీసుకున్న వారికి 28 రోజుల వ్యవధి అనంతరం(ఫిబ్రవరి 13నుంచి) రెండోడోసు పంపిణీ కొనసాగుతోంది.

మరోవైపు, అంతర్జాతీయ నివేదికల ప్రకారం..ఇప్పటికే 82దేశాలు వ్యాక్సినేషన్​ మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సమాచారం. అయితే చైనాలోనూ వ్యాక్సినేషన్‌ భారీ స్థాయిలో చేపడుతున్నప్పటికీ వాటికి సంబంధించిన అధికారిక సమచారం అందుబాటులో లేదు. ఇక కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తొలిసారిగా రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యాలో మాత్రం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రష్యాలో వ్యాక్సిన్​ తీసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపట్లేదు.