Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిషన్ తన పదవీకాలం పూర్తయ్యే ఒకరోజు ముందే సరిహద్దులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత.. ఆర్డర్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది కమిషన్.
జమ్ముూ కశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. వాటితో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్కు తొమ్మిది సీట్లు కేటాయించింది. జమ్మూలో ఆరు స్థానాలు, కశ్మీర్లో ఒక స్థానాన్ని అదనంగా ప్రతిపాదించింది కమిషన్. ఇప్పటి నుంచి కశ్మీర్ డివిజన్లో 47సీట్లు, జమ్ము డివిజన్లో 43 సీట్లు ఉండనున్నాయి.
జమ్ముూకశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020, మార్చిలో డిలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది కేంద్రం. 2021లో మరో ఏడాది పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర, జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారు. అయితే, ఈ కమిటీ పదవీ కాలం మార్చి 6తో ముగియాల్సి ఉండగా.. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు 2022, మార్చిలో రెండు నెలలు పొడిగించారు.
Also Read : Viral Video : స్విమ్మింగ్ పూల్లో దూకిన చిన్నారి…రెప్పపాటులో కాపాడిన తల్లి
కమీషన్ కొత్తగా ప్రతిపాదించిన నియోజకవర్గాలలో జమ్మూలోని రాజౌరీ, దోడా, ఉధంపూర్, కిష్త్వార్, కథువా, మరియు సాంబా జిల్లాల నుండి ఒకనియోజకవర్గం ఉన్నాయి. కశ్నీర్ లోయలో కుప్వారా జిల్లా నుంచి ఒక కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న అభివృధ్ది ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల కోరింది. డి లిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.