Mumbai: ముంబై పిజ్జా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం… ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఘట్కోపార్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. పరాఖ్ ఆస్పత్రి పరిధిలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు రెస్టారెంట్లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖుర్షి దేదియా అనే 46 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
మరో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెస్టారెంట్ ఉన్న బిల్డింగులోనే పరాఖ్ ఆస్పత్రి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడి పేషెంట్లను ఆస్పత్రి సిబ్బంది, అధికారులు వేరే ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఈ ఘటనలో 22 మంది పేషెంట్లను వేరే చోటుకు తరలించారు. ప్రస్తుతం రోగులంతా క్షేమంగానే ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిబ్బంది ఎనిమిది అగ్నిమాపక కేంద్రాల్ని మోహరించి, మంటలు ఆర్పేస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే భీమా కోరేగావ్ ప్రాంతంలో కూడా మరో అగ్నిప్రమాదం సంభవించింది. పూనే సమీపంలోని షిరూర్ పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అగ్నిమాకప దళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Maharashtra: Fire breaks out near Parekh Hospital in Mumbai's Ghatkopar. Eight fire tenders have reached the spot. Further details awaited: Mumbai Fire Brigade pic.twitter.com/iiKUAIGEAh
— ANI (@ANI) December 17, 2022