Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి విడుదల
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Molnupiravir 200mg capsules : హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ఫార్మా..మార్కెట్లోకి కరోనా వైరస్ను నియంత్రించే మోల్నుపిరవిర్ 200 ఎంజీ కాప్యూల్స్ను విడుదల చేసింది. అత్యవసర వినియోగానికి ఇప్పటికే ఈ ఔషధానికి డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. ఈ ఔషధంపై ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహించి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో కాప్యూల్ ధరను 63 రూపాయలుగా నిర్ణయించింది.
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఈ మాత్రల పరిశోధన, అభివృద్థి కోసం రూ.30 కోట్లు వెచ్చించామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశామన్నారు. ఇందులో ఎగుమతుల వాటా సగం ఉందన్నారు. 40 దేశాలకు పైగా ఎగుమతులు కలిగి ఉన్నామన్నారాయన.
ఫార్మా రంగం ఇటీవల కాలంలో భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, వచ్చే ఐదేండ్లలో వ్యాపార విస్తరణకోసం 1,500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడతామన్నారు శ్రీనివాస్ రెడ్డి . దీంట్లో ఏటా 200-300 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నిధులను వ్యాపార విస్తరణకోసం, హైదరాబాద్లో ఉన్న మూడు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతర సంస్థలను కొనుగోలు చేయడానికి వెచ్చించనున్నట్టు చెప్పారు.