INDvs WI 3rd ODI : టీమ్ఇండియా అతి ప్రయోగాలా..? వరుణుడి ఆటనా..?
భారత్, వెస్టిండీస్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తలపడనున్నాయి.
![INDvs WI 3rd ODI : టీమ్ఇండియా అతి ప్రయోగాలా..? వరుణుడి ఆటనా..? INDvs WI 3rd ODI : టీమ్ఇండియా అతి ప్రయోగాలా..? వరుణుడి ఆటనా..?](https://10tv.in/wp-content/uploads/2023/08/INDvs-WI-3rd-ODI.jpg)
INDvs WI 3rd ODI
INDvs WI : భారత్, వెస్టిండీస్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్ 1-1 తో సమంగా ఉండడంతో ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. రెండో వన్డేలో అతి ప్రయోగాలకు పోయిన టీమ్ఇండియాకు తలబొప్పి కట్టింది. దీంతో ఈ మ్యాచ్లో అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సిరీస్ సొంతం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రయోగాలకు చెక్..?
రెండో వన్డేలో టీమ్ఇండియా బ్యాటింగ్లో ప్రయోగాలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇచ్చింది. యువ ఆటగాళ్లు పూర్తిగా విఫలం కావడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో కీలకమైన మూడో వన్డేలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తుది జట్టులోకి రానున్నారు.
వర్షం ముప్పు..
ఇదిలా ఉంటే.. వరుణుడు ఈ మ్యాచ్కు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం ట్రినిడాడ్లో మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఉంటుందట. 55 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆక్యూవెధర్ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగుతుందా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.
పిచ్..
మ్యాచ్ జరిగే బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ స్పిన్కు అనుకూలం. వికెట్ చాలా స్లోగా ఉంటుంది. దీంతో బ్యాటర్లు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న నేడు జరుగనున్న మ్యాచే పురుషుల క్రికెట్లో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.
India Tour of Ireland : ఐర్లాండ్తో టీ20 సిరీస్.. బుమ్రా వచ్చేశాడు.. కెప్టెన్సీ కూడా అతడికే
రెట్టించిన ఉత్సాహంతో విండీస్
రెండో మ్యాచ్లో గెలిచిన వెస్టిండీస్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ ప్రదర్శననే పునరావృతం చేయాలని షై హోప్ సేన గట్టి పట్టుదలతో ఉంది. మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించకలేకపోయిన వెస్టిండీస్ జట్టు భారత్తో సిరీస్ను నెగ్గి ఆ బాధను నుంచి తేరుకోవాలని చూస్తోంది. ఫామ్లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ షై హోప్పైనే విండీస్ మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అతడితో పాటు మేయర్స్, హెట్మయర్, కింగ్, అథనేజ్ లు బ్యాటింగ్లో రాణించాలని విండీస్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది.