India’s First Omicron Patient : దుబాయ్ వెళ్లిపోయిన భారత తొలి “ఒమిక్రాన్” బాధితుడు
భారత్ లో బయటపడిన రెండు "ఒమిక్రాన్" కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి
India’s First Omicron Patient : భారత్ లో బయటపడిన రెండు “ఒమిక్రాన్” కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకి వచ్చిన 66 ఏళ్ల బాధితుడు వారం రోజుల తర్వాత అంటే నవంబర్-27న దుబాయ్ కి వెళ్లిపోయాడని బృహత్ బెంగళూరు మహనగర పాలికె(BBMP)అధికారులు తెలిపారు. అతడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు.
నవంబర్-20న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతడు నేరుగా హోటల్కు వెళ్లగా, అదే రోజు అతడు కరోనా బారినపడ్డాడు. హోటల్ కు వెళ్లి పరీక్షించిన ప్రభుత్వ డాక్టర్ అసింప్టమాటిక్గా తేల్చారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని అతనికి సూచించారు.
అయితే ఆఫ్రికాలో అప్పటికే ఒమిక్రాన్ కలకలం రేపడం,పైగా అతడు “ఎట్ రిస్క్(ప్రమాదం పొంచి ఉన్న)” దేశాలలో ఒకదాని నుండి వచ్చిన ప్రయాణికుడు కావడంతో అతని శాంపిల్స్ ను మళ్లీ సేకరించి నవంబర్ 22న జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కు పంపారు అధికారులు.
అయితే నవంబరు 23న బాధితుడు ఓ ప్రైవేటు ల్యాబ్లో పరీక్షించుకోగా నెగటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతడు 27వ తేదీ అర్ధరాత్రి హోటల్ నుంచి బయటపడి క్యాబ్ లో విమానాశ్రయానికి చేరుకుని దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.
మరోవైపు,బాధితుడితో నవంబర్-20న విమానంలో బెంగళూరుకి వచ్చిన మిగతా 24 మందిని పరీక్షించగా కరోనా నెగటివ్గా నిర్ధారణ అయింది. అలాగే, అతడి 240 మంది సెకండరీ కాంటాక్టులను కూడా పరీక్షించారు. వారికి కూడా కరోనా సోకలేదని నిర్ధారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక,ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 25 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ALSO READ Omicron : భారత్లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు