Karnataka Election 2023: కన్నడ ప్రజలపై బీజేపీ హామీల జల్లు.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Karnataka Election 2023: కన్నడ ప్రజలపై భారతీయ జనతా పార్టీ హామీల జల్లు కురిపించింది. పలు హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కర్ణాటక సీఎం బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఇతర బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రజా ధ్వని’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో పేదలకు 10 లక్షల ఇళ్లు ఇస్తామని, సామాజిక న్యాయ నిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లపాటు రూ. 10వేలు ఎఫ్డీ ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు, కర్ణాటక అపార్ట్ మెంట్ యాజమాన్య చట్టం, 1972ను సంస్కరిస్తామని, బీజేపీ హామీ ఇచ్చింది. ఇందుకోసం బెంగళూరులోని అపార్ట్ మెంట్ నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే కర్ణాటక నివాసితుల సంక్షేమ సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.
karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల్లో ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి .. ఎవరీ రామక్క..!
మే 10న కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మే 13న ఫలితాలు వెలువడతాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియసైతం పూర్తయింది. ఈ క్రమంలో బీజేపీ సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అనంతరం .. సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో మేనిఫెస్టోను దృష్టిలో ఉంచుకున్నామని తెలిపారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని చెప్పారు. ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని చెప్పారు.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు ..
– రైతులకు రూ. 5లక్షలు వడ్డీలేని రుణాలు
– ప్రతీ సంవత్సరం ఉగాది, గణేష్ చతుర్ధి, దీపావళి పండుగల సందర్భంగా బీపీఎల్ కుటుంబాలకు మూడు సార్లు ఉచిత గ్యాస్ సిలీండర్లు అందజేత.
– తక్కువ ధరలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతీ వార్డులో అటల్ ఎథిక్స్ సెంటర్లు ఏర్పాటు.
– పోషణ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ప్రతీరోజూ ఉచితంగా అర లీటరు చొప్పున నందిని పాల పంపిణీ
– ప్రతి నెలా రేషన్ కిట్స్.. ఐదు కేజీల శ్రీ అన్న-సిరి ధాన్య పంపిణీ
– ఇళ్లులేని నిరుపేదల కోసం 10లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ.
– సామాజిక న్యాయ నిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లపాటు రూ. 10వేలు ఎఫ్డీ చేయబడుతుంది.
– ప్రతీ సంవత్సరం సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు.
– ప్రభుత్వ పాఠశాలలు ప్రపంచ స్థాయి నిబంధనల ప్రకారం అప్ గ్రేడ్.
– బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్
– పర్యాటక రంగ అభివృద్ధికి రూ. 1500 కోట్లు.
– మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరు.
– కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు.
– తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన.
– యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు.