K.S. Chandra Sekhar : కరోనాతో కె.ఎస్. చంద్ర శేఖర్ కన్నుమూత..

ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె. ఎస్. చంద్ర శేఖర్ గారు కోవిడ్‌తో మరణించారు.. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం..

K.S. Chandra Sekhar : కరోనాతో కె.ఎస్. చంద్ర శేఖర్ కన్నుమూత..

K S Chandra Sekhar Passed Away Due To Covid 19

K.S. Chandra Sekhar: ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె. ఎస్. చంద్ర శేఖర్ గారు కోవిడ్‌తో మరణించారు.. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం.. వీరికి భార్య, ముగ్గురు కుమార్తెలు.. 1990 లో అల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు.. అల్లు రామలింగయ్య గారి ‘బంట్రోతు భార్య’ చిత్రంతో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్ర శేఖర్, సంగీతదర్శకులు కె. చక్రవర్తి గారి వద్ద 70 కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా పని చేశారు. తదుపరి రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగానూ పనిచేశారు.

K.s. Chandra Sekhar

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అల్లు అరవింద్ నిర్మించిన ‘యమకింకరుడు’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు.. ఆ కోవలో ‘బ్రహ్మముడి’ ( రజని తొలిచిత్రం ), భానుచందర్, ‘హంతకుడి వేట’, రాజేంద్ర ప్రసాద్ ‘ఆణిముత్యం’, కోడి రామకృష్ణ గారి ‘ఉదయం’ మరియు ‘అదిగో అల్లదిగో’, దాసరి గారి ‘భోళాశంకరుడు’, ‘ఆత్మ బంధువులు’, ‘కంచి కామాక్షి’ ( తమిళ్ & హిందీ ) ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తదనంతరం విశాఖపట్నం అల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఈ మధ్యనే పదవీ విరమణ పొందారు.

K.s. Chandra Sekhar

ఘంటసాల గారు తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి తన హార్మోనియం బహుమతిగా ఇస్తే అది ఎంతో భద్రంగా అపురూపంగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అతిథులకు దానినే ముందుగా చూపించేవారు. కీరవాణి, కోటి, మణిశర్మ వీరి దగ్గర శిష్యరికం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తరువాత కూడా తానొక వెటర్నటీ డాక్టర్ అయినా తనకిష్టమైన రంగంలో పిహెచ్‌డి పూర్తి చేసిన నిత్య విద్యార్థి.. తన జీవితంలో దాసరి గారి చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు.. ఆయన మరణ వార్తను సినీ రంగంలో కొనసాగుతున్న వారి మేనల్లుడు మహేంద్ర చిత్ర పరిశ్రమకు మీడియాకు తెలియజేశారు.