MLA Seethakka : ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, భట్టివిక్రమార్కతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు
MLA Seethakka : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునించింది. మొదట ఇందిరా పార్క్ వద్ద సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అనుకున్నట్లుగానే ఇందిరా పార్క్ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇక అనంతరం కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా రాజ్భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక కాంగ్రెస్ ముఖ్యనాయకులైన భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జ్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, యూత్ కాంగ్రెస్ నేత శివసేనారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేతల పిలుపుతో రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.