Sonia Gandhi: విపక్షాలతో సోనియా భేటీ.. ఆగష్టు 20న ముహూర్తం!
దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు అటు ప్రధాని మోడీ నుండి ఇటు ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ వరకు అందరినీ కలుస్తూ భేటీలు నిర్వహిస్తున్నారు.
Sonia Gandhi: దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు అటు ప్రధాని మోడీ నుండి ఇటు ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ వరకు అందరినీ కలుస్తూ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త కొత్త ఎత్తులతో జాతీయ రాజకీయాలలో ఆసక్తిగా మారారు.
ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయ రాజకీయాలలో ఇప్పుడు లంచ్ మీటింగ్ లు, టీ కాన్ఫిరెన్సులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ సర్కార్పై ప్రతిపక్షాలు సమైక్యంగా గళమెత్తిన తరహాలోనే విపక్షాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విందు భేటీలను కొనసాగించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో మోడీ సర్కార్ను ఇరుకునపెట్టేలా వ్యవహరించాలని విపక్షాలను కోరుతూ రాహుల్ గాంధీ ఇటీవల విపక్ష నేతలకు బ్రేక్ఫాస్ట్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
విపక్ష నేతలకు రాహుల్ ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ విందు సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే సోనియా గాంధీ కూడా విపక్ష నేతలతో వివిధ భేటీలు నిర్వహించి మరింత కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా ఆగష్టు 20న విపక్షాల పార్టీల నేతలతో సమావేశం కానున్నారట. వర్చువల్ లో జరగనున్న ఈ సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా యూపీఏ సీఎంలను అందరినీ ఆహ్వానించాలని సోనియా యోచిస్తోందని తెలిసింది. అనంతరం త్వరలో విపక్ష నేతలకు విందు సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది.