No Entry For Women In Temple : ఆ ఊరిలో వింత ఆచారం.. ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ, ఎందుకో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లోని ఓ దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. అంతేకాదు ఆ రోజు కార్యక్రమాలన్నీ పురుషులే చేయాలి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో ఈ ఆచారం కొనసాగుతోంది.
No Entry For Women In Temple : పండుగలు, తీర్ధాలు, తిరునాళ్లలో ఎక్కడైనా మహిళల హడావుడి కనిపిస్తుంది. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించి భక్తిశ్రద్దలతో ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. ఇంటి అలంకరణ నుంచి పూజాద్రవ్యాల సేకరణ, పొంగళ్ల తయారీ, దేవుడికి నైవేద్యం నివేదన అంతా మహిళల చేతుల మీదుగానే జరుగుతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఓ దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. అంతేకాదు ఆ రోజు కార్యక్రమాలన్నీ పురుషులే చేయాలి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో ఈ ఆచారం కొనసాగుతోంది.
తిప్పాయిపల్లిలోని శ్రీ సంజీవరాయస్వామి గుడిలో సంక్రాంతికి ముందు ఆదివారం పొంగళ్ల పండగను ఘనంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామినే సంజీవ రాయస్వామిగా ఇక్కడి ప్రజలు కొలుస్తారు. రామ రావణ యుద్ధంలో గాయపడిన లక్ష్మణుడిని రక్షించేందుకు ఆంజనేయుడు సంజీవని పర్వతం తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే ఆగి సూర్య నమస్కారం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
Also Read..Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం
దేశ విదేశాల్లో ఎక్కడున్నా అందరూ ఈ పొంగళ్ల పండక్కి గ్రామానికి తరలివస్తారు. పొంగళ్ల తయారీ నుంచి దేవుడికి నివేదన వరకు ఎక్కడా మహిళల ప్రమేయం ఉండదు. కట్టెపుల్లలు, బియ్యం, బెల్లం, పప్పు, నూనె, నెయ్యి.. ఇలా ఏదీ ముట్టుకోకూడదు. పురుషులే తయారు చేసుకుని వచ్చి సంజీవరాయుడికి నివేదన ఇస్తారు. ఆడవాళ్లు ఏ వస్తువు ముట్టుకున్నా అరిష్టం జరుగుతుందని భయపడతారు.
ఆలయంలో పొంగళ్ల తయారీ నుంచి కొబ్బరి కాయలు కొట్టే పనులన్నీ పురుషులే చేస్తారు. గుడి వెలుపల వేచి ఉండే మహిళలు హారతి తీసుకోవడానికే పరిమితం అవుతారు. ప్రసాదాన్ని స్వీకరించరు. అనాదిగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. పొంగళ్ల పండగ రోజు మాత్రమే మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధం ఉంది. మిగిలిన అన్ని రోజుల్లోనూ దర్శనం, పూజలు చేసుకోవచ్చు.