BJP Protest Rally : మారిన బీజేపీ నిరసన వేదిక.. శాంతి ర్యాలీ.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నం

BJP Protest Rally : మారిన బీజేపీ నిరసన వేదిక.. శాంతి ర్యాలీ.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

Telangana Bjp To Protest Against Bandi Sanjay Arrest

BJP Protest Rally : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ శాంతి ర్యాలీ నిర్వహించనుంది. అయితే ముందుగా ఎల్బీ స్టేడియం వద్ద బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి లిబర్టీ వరకు నిరసన ర్యాలీ చేపట్టలనీ బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు.

అనివార్య కారణాలతో బీజేపీ నిరసన వేదిక మారింది. సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే శాంతి ర్యాలీ చేపట్టినట్టు కమలనాథులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంటలకు జరగున్న శాంతి ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి నడ్డా పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో బీజేపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతినిస్తారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. జైల్లో ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో ములాఖత్ కానున్నట్టు తెలుస్తోంది.

ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు కొట్టివేసింది. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్‌ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈనెల 17 వరకు బండి సంజయ్‌తో పాటు కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచరవి, మర్రి సతీశ్‌లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు.

317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ ఆదివారం రాత్రి కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కోవిడ్ నిబంధనలు అమలవుతున్న కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దాదాపు మూడు గంటల హై డ్రామా మధ్య బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.

Read Also : Bandi Sanjay : బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ..!