Karimnagar Vaccination : వ్యాక్సినేషన్ లో కరీంనగర్ రికార్డు.. రెండో డోసు పంపిణీ వంద శాతం పూర్తి
వంద శాతం వ్యాక్సినేషన్ రికార్డ్ సృష్టించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
Karimnagar corona vaccination : వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. నిన్నటి వరకు జిల్లాలో రెండో డోసు పంపిణీ వంద శాతం పూర్తయింది. దీంతో రాష్ట్రంలో రెండు డోసులు వంద శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో 7 లక్షల 92 వేల 922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా..మొదటి డోసు లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8లక్షల 27 వేల 103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో సెకండ్ డోసు అందజేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్ సిటీ మొదటి స్థానంలో నిలువగా, కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది.
వంద శాతం వ్యాక్సినేషన్ రికార్డ్ సృష్టించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం
మొదటి డోసు విషయంలో తెలంగాణ ఇప్పటికే వంద శాతం లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాల వారీగా పరిశీలించగా..నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో టార్గెట్ పూర్తయితే అన్ని జిల్లాలు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం చేసుకుంటాయి. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన వారికి 2 కోట్ల 77 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ఆదేశించగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోసు 2 కోట్ల 88 లక్షల మందికి వేశారు.