Ganesh Immersion : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Government : గణేష్ విగ్రహాల నిమజ్జనం హైదరాబాద్లో ప్రశ్నార్థకంగా మారింది. మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాల విగ్రహాల నిమజ్జనానికి మరోసారి నో చెప్పింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇవాళ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దన్న తీర్పును అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతవారం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై అత్యవసర విచారణ జరిపిన ధర్మాసనం..నిమజ్జనంపై తీర్పును సవరించలేమని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారింది. విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇటు హైకోర్టు ఆదేశాలు, అటు ప్రభుత్వం నుంచి స్పష్టత లేక..భక్తులు అయోమయంలో పడ్డారు.
ఈ ఒక్కసారికి ట్యాంక్బండ్లో నిమజ్జనానికి అనుమతించాలని.. లేకపోతే నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ..హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అవసరమని తెలిపింది. భాగ్యనగరంలో భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారని, వాటిలో నెలకొల్పిన వేలాది విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని నీటి కుంటలు అందుబాటులో లేవని తెలిపింది.
పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. అటు సాగర్లో విగ్రహాల నిమజ్జనాన్ని ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందంటూ కోర్టు దృష్టికి జీహెచ్ఎంసీ తీసుకెళ్లింది. మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభించే ప్రమాదం ఉందని పేర్కొంది. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరారు.
Ganesh Immersion : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం పరిస్థితులన్నీ సర్కార్ సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేకానీ.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. ఇప్పుడైతే తీర్పును సవరించలేమని తేల్చి చెప్పింది. హుస్సేన్సాగర్ని కాలుష్యం చేయమని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే తీర్పును సవాల్ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.
హుస్సేన్ సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ మంటపాల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపడంలేదని మండిపడుతున్నారు. భక్తులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రతిపక్షాల నేతల డిమాండ్లు పెరగడంతో.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే ఇప్పుడు బల్దియా ముందున్న కింకర్తవ్యంగా ఉంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్ను తీస్తోంది.
నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది. అయితే కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్లో కష్టమవనుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్సాగర్లోనే విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పోలీస్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్తో చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.