WTC final: ఆస్ట్రేలియా కొత్త జెర్సీని చూశారా..? టీమ్ఇండియాతో మ్యాచ్ కోసమేనట
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
Usman Khawaja: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లండన్లోని ఓవల్(Oval) వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు టీమ్ఇండియా(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి విశ్వ విజేతగా నిలవాలని అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) తెలిపాడు. కొత్త జెర్సీ వేసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ జెర్సీ గ్యాంగ్స్టా. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం.” అంటూ రాసుకొచ్చాడు. ఈ జెర్సీ బాగుంది. ఎడమ వైపున WTC లోగోతో ముదురు ఆకుపచ్చ V-మెడ అంచుని కలిగి ఉంది.
Not gonna lie. These vest are gangsta 🔥. World Test Championship. #straya🇦🇺🦘🪃 #loveavest #prizedpossession #wtc #gonnaneedit❄️ pic.twitter.com/wr6npGJs38
— Usman Khawaja (@Uz_Khawaja) May 23, 2023
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్లో కొత్త జెర్సీతో ఆడనున్నారు. అయితే ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉండడంతో జెర్సీ వివరాలను ఇంకా తెలియరాలేదు. కిల్లర్ స్థానంలో అడిడాస్ భారత కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది.
లండన్ విమానం ఎక్కిన భారత ఆటగాళ్లు..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం 20 మందితో కూడిన భారత బృందం నేడు(మంగళవారం) ఉదయం లండన్ బయలుదేరింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, స్టాండ్ బై ఆటగాడు ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్దీప్, పుల్కిత్ నారంగ్లతో పాటు పలువురు సహాయ సిబ్బంది వెళ్లారు. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్లు రేపు వెళ్లనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు రెండు వారాల ముందగానే మొదటి బృందం లండన్కు బయలు దేరింది. ఇక ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ ఆడనున్న భారత ఆటగాళ్లైన రోహిత్ శర్మ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ లు ఐపీఎల్ ముగియగానే లండన్ విమానం ఎక్కనున్నారు.