బీజేపీ ఆఫీసుకి కమెడియన్ అలీ.. ఎందుకంటే?

  • Published By: vamsi ,Published On : January 24, 2020 / 10:41 AM IST
బీజేపీ ఆఫీసుకి కమెడియన్ అలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అలీ.. ఢిల్లీ బీజేపీ ఆఫీసుకి వెళ్లారు. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం వార్తాంశంగా మారింది. అలీ పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వచ్చేశాయి. అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు కమెడియన్ అలీ. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోసమే ఢిల్లీకి వచ్చినట్లు అలీ వెల్లడించారు.

ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో భారత్‌కు రాబోతున్నారని, ఆయన ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారని, ఆయన కోసమే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు అలీ చెప్పారు. దీంతో అలీ పార్టీ మారతారేమో అనే ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. 

ఎన్నికలకు ముందు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రచారం కూడా చేసిన అలీ, పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవిలో కనిపిస్తారని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు.