వంద మంది అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన కత్రినా కైఫ్
లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ముందుకొచ్చారు.
కత్రినా కైఫ్ వంద మంది నృత్యకారులకు అండగా నిలిచారు. వంద మంది బాలీవుడ్ నేపథ్య నృత్యకారులకు కత్రినా ఆర్థికంగా సహాయం చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వంద మంది డ్యాన్సర్లకు నేరుగా డబ్బును వారి బ్యాంకు అకౌంట్లకు పంపారు. తద్వారా సైడ్ డాన్సర్లు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని ఆమె అభిప్రాయం.
బాలీవుడ్ నేపథ్య నృత్యకారులతో సమన్వయం చేసిన రాజ్ సురానీ మాట్లాడుతూ.. కత్రినా సహాయంగా పంపిన డబ్బుతో, ఈ నృత్యకారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించారని చెప్పారు. వీటిలో టిఫిన్ సేవలు, బ్యూటీషియన్ సేవలు, ఇంట్లో వస్తువుల అమ్మకాలు, కూరగాయల అమ్మకాలు వంటి మొదలైనవి ఉన్నాయని అన్నారు.
సినిమా షూటింగ్లు మొదలైనా పాటల చిత్రీకరణలు ఎప్పుడు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనడం తప్ప వేరే మార్గం లేదు. సైడ్ డ్యాన్సర్లకు గత కొన్ని నెలలుగా చాలా కష్టమైన సమయం అని రాజ్ సురానీ అన్నారు. వారికి ఆదాయ వనరులు లేవు. ఇటువంటి సమయంలో సహాయం చేసిన కత్రినా కైఫ్కు కృతజ్ఞతలు తెలిపారు రాజ్ సురానీ.