Chiranjeevi: అభిమానికి అండగా చిరంజీవి.. ఫ్లైట్ టిక్కెట్ వేయించి హైదరాబాద్ రప్పించి!
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సాయం చెయ్యడంలో ఎప్పుడూ ముందుంటారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సాయం చెయ్యడంలో ఎప్పుడూ ముందుంటారు. అభిమానులకు అండగా నిలబడతారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లకు.. తన అభిమానులకు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. లేటెస్ట్గా చిరంజీవి తన వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్కు సాయం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్.. ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని రిక్వెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న విషయాన్ని వెల్లడించారు.
వెంటనే స్పందించిన చిరంజీవి కలవాలని భావించిన వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టిక్కెట్ వేయించి రప్పించారు. తన నివాసంలో ఇద్దరితో దాదాపు 45 నిమిషాల గడిపారు చిరంజీవి. తన వీరాభిమాని వెంకట్, వెంకట్ భార్య సుజాతతో చిరంజీవి కూలంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్కు చెకప్ కోసం పంపించారు.
ఒమేగా హాస్పిటల్స్లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి.. అన్నీ రకాల పరీక్షలు చేయించి, వైద్యులను వెంకట్ సొంత ప్రాంతం విశాఖపట్నంలో హాస్పిటల్లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్లో ఖర్చులు తానే పెట్టుకోనున్నట్లు చిరంజీవి చెప్పారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్యం చేయించడానికి సిద్ధమన్నారు. వీరాభిమాని వెంకట్ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదన్నారు చిరంజీవి.