రాజశేఖర్ కుమార్తెల పెద్ద మనసు..

రాజశేఖర్ కుమార్తెల పెద్ద మనసు..

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు.

Shivani Rajashekar Contributes Rs 2 Lakhs for Telangana CM Relief fund and Corona Crisis Charity

ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ “కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్” అని చెప్పారు. అలాగే సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన `సిసీసీ`కి వీరు గతంలో రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. నేడు నిర్మాత సి.కల్యాణ్‌ను కలిసి చెక్ అందించారు.