అమ్మకానికి నాలుగు ప్రభుత్వ బ్యాంకులు? బ్యాంకింగ్ సెక్టార్‌ను కూడా ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం

అమ్మకానికి నాలుగు ప్రభుత్వ బ్యాంకులు? బ్యాంకింగ్ సెక్టార్‌ను కూడా ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం

4 Government Banks Shortlisted For Privatisation: నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అందులో భాగమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. నష్టాలను చూపి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. కేంద్రం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నాయి.

తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కేంద్రం కన్ను ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ పై పడిందట. బ్యాంకింగ్ సెక్టార్ ను కూడా ప్రైవేటుపరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని… ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు ప్రభుత్వ బ్యాంకులను అమ్మేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం.

తొలి విడతలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల్లో రెండింటిని 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే అమ్మేస్తారని వార్తలు వస్తున్నాయి.

తొలుత చిన్న బ్యాంకులు, మధ్య తరగతి బ్యాంకులను ప్రైవేటైజ్ చేసి, ప్రజా స్పందనను తెలుసుకునే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందట. రాబోయే సంవత్సరాల్లో పెద్ద బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేస్తారని అంటున్నారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ప్రభుత్వం అత్యధిక వాటాను ఉంచుకుంటుందట.

ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తక్కువ ఉద్యోగులు ఉన్నందు వల్ల తొలుత ఈ బ్యాంకును అమ్మేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో ఐదారు నెలల్లో ప్రైవేటైజేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సమాచారం.