Mamata Banerjee Cabinet : 43మంది మంత్రులతో కొలువుదీరనున్న మమత మంత్రివర్గం..
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కీలకమైన హోంశాఖను సీఎం మమతా బెనర్జీయే నిర్వహిస్తారని తెలుస్తోంది.
Mamata Banerjee Cabinet : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కీలకమైన హోంశాఖను సీఎం మమతా బెనర్జీయే నిర్వహిస్తారని తెలుస్తోంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని మమత నిర్ణయించారు. సుబ్రతా ముఖర్జీ, అనూప్ రాయ్ లాంటి సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చు.
బెంగాల్ కేబినెట్లో 44 బెర్తులు ఉన్నాయి. తాజాగా 43 మందిని మంత్రులుగా తీసుకుంటే మమతతో కలిసి 44 మంది అవుతారు. తృణమూల్ కాంగ్రెస్ నేత బిమన్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా ఈ పదవికి ఎంపిక కావడం ఇది మూడోసారి. అటు సీఎం మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె.
బెహాలా ఈస్ట్ నుంచి టీఎంసీ పార్టీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా రత్నా ఛటర్జీ విజయం సాధించారు. రత్నా ఛటర్జీ కోల్కతా మాజీ మేయర్ సోవాన్ ఛటర్జీ భార్య. నందిగ్రామ్లో ఓటమి ఎదురైనప్పటికీ, దీదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రానున్న ఆరు నెలల్లో అసెంబ్లీకి మమత బెనర్జీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి తమ సీటును ఖాళీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.