పేద‌ల‌కు పంచిన పిండి ప్యాకెట్లలో రూ.15 వేలు, ఇది ఆ స్టార్ హీరో పనేనా

  • Published By: raju ,Published On : April 28, 2020 / 10:45 AM IST
పేద‌ల‌కు పంచిన పిండి ప్యాకెట్లలో రూ.15 వేలు, ఇది ఆ స్టార్ హీరో పనేనా

లాక్‌డౌన్ పొడిగింపుతో దేశంలో ఆక‌లి కేక‌లు మిన్నంటాయి. ముఖ్యంగా నిరు పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉంది. ఈ క‌ష్ట స‌మ‌యంలో పలు రంగాలకు చెందిన వారు ముందుకొచ్చారు. చేతనైనా సాయం చేస్తున్నారు. నిరుపేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తున్నారు. కొందరు డబ్బు సాయం చేస్తే, మరికొందరు నిత్యావసరాలు పంచారు. ఇంకొందరు అన్నదానం చేశారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్‌ పేదల‌కు వినూత్న సాయం చేశాడంటూ ఓ టిక్‌టాక్‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది అమీర్ ఖాన్ పనే అంటూ టిక్ టాక్ వీడియో
ఇంత‌కీ ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేద‌ల‌కు సాయం చేసేందుకు ఓ ట్ర‌క్కు వీధిలో వ‌చ్చి ఆగుతుంది. అందులో ఉన్న‌వాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్ల‌ను పేద‌ల‌కు అందించారు. అయితే కొంద‌రు మాత్రం ఉత్తి పిండికేనా ఇదంతా.. అని వెనుదిరిగిపోయారు. కానీ క‌నీసం అది కూడా లేని నిరుపేద‌లు ముందుకొచ్చి ఆ ప్యాకెట్ల‌‌ను అందుకున్నారు.

ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడ‌గా ఆశ్చర్యపోయారు. అందులో రూ.15 వేలుక‌నిపించాయ‌ట‌. దీంతో ఆశ్చర్యంతో కూడి ఆనందం వారి సొంతమైంది. కాగా, ఈ ట్రక్కును పంపించింది ఎవరు? వారికి సాయం చేసింది ఎవరు? అనే వివరాలు ఏవీ తెలియవు. కొంతమంది మాత్రం ఇది కచ్చితంగా స్టార్ హీరో అమీర్ ఖాన్ పనే అని చెప్పుకుంటున్నారు. దీనిపై అమీర్ ఖాన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.