మే-4నుంచి సీబీఎస్ఈ పరీక్షలు…కేంద్ర విద్యాశాఖ మంత్రి
CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ 10,12 తరగతులకు…మే 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువారం(డిసెంబర్-31,2020) కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు.
10,12వ తరగతి బోర్డు పరీక్షలు.. మే 4నప్రారంభమై, జూన్ 10న ముగుస్తాయని రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఏ తేదీన ఏ పరీక్ష జరుగుతుందన్న పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. జూలై 15 న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పరీక్షలపై విద్యార్థుల సందేహాలు, అనుమానాలు తీరాయి.
కరోనా మహమ్మారి విజృంభించడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కొత్త కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో… తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు పరీక్షలను మే నెలలో కేంద్రం జరుపనుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్లైన్ తరగతులు సరిగ్గా జరగడం లేదని విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. మే 4 నుంచి ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడంతో ఈసారి సిలబస్ను తగ్గించనున్నారు. నిజానికి మార్చిలోనే నిర్వహించాల్సిన పరీక్షలను కొన్ని రాష్ట్రాల్లో తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు.