Work From Home: కొత్త ఆంక్షలు.. ఆఫీసులు మూసివేత.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
Work From Home: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకుని వచ్చింది. కొత్త నిబంధనలు ప్రకారం, ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
ప్రైవేట్ ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. DDMA జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో అవసరమైన సేవలతో అనుసంధానించబడిన కార్యాలయాలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయబడతాయి. దీని ఉద్దేశ్యం కరోనా ముప్పును అలాగే దాని విస్తరణను తగ్గించడం.
ఢిల్లీలో మినహాయించబడిన కేటగిరీకి చెందినవి తప్ప ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆఫీసులు మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. రెస్టారెంట్లు, బార్లలో వ్యాక్సిన్ వేసుకున్నవారికి మాత్రమే అనుమతించాలని ఆర్డర్ జారీ చేసింది. ఇప్పటివరకు రెస్టారెంట్లు తమ సీటింగ్ కెపాసిటీలో 50 శాతంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డైన్-ఇన్ సదుపాయాన్ని నిర్వహించడానికి అనుమతించబడ్డాయి.
అదేవిధంగా, 50 శాతం సీటింగ్ కెపాసిటీతో బార్లను మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్కో మండలంలో ప్రతిరోజూ ఒక వీక్లీ మార్కెట్ను మాత్రమే అనుమతిస్తారు. మార్కెట్లో ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ కంపల్సరీ.
ఇదే సమయంలో మెట్రో మరియు బస్సులలో సీటింగ్ సామర్థ్యం వంద శాతం నుండి 50 శాతానికి తగ్గించడం గురించి చర్చించారు. బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ అంశంపై అధికారులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.