కాలం చెల్లిన 2G మిసైల్ ని డీఎంకే వదిలింది..సీఎం తల్లినే అవమానించారన్న మోడీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై ప్రధాని ఫైర్ అయ్యారు.

కాలం చెల్లిన 2G మిసైల్ ని డీఎంకే వదిలింది..సీఎం తల్లినే అవమానించారన్న మోడీ

Dmk

DMK తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై ప్రధాని ఫైర్ అయ్యారు. డీఎంకే, కాంగ్రెస్​కు మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించారు. పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ,మాజీ కేంద్రమంత్రి ఏ రాజా పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు. సీఎం పళనిస్వామి తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే మహిళలను గౌరవిస్తారా? అని ప్రధాని ప్రశ్నించారు.

రాజాని ఉద్దేశించి ‘కాలం చెల్లిన 2జీ మిసైల్’​ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్​ పని చేస్తోందని దుయ్యబట్టారు. తమిళ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని కాంగ్రెస్​, డీఎంకే గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని అన్నారు.

డీఎంకే ఎంపీ రాజా ఏమన్నారు

కాగా,డీఎంకే ఎంపీ ఏ రాజా ఓ సభలో మాట్లాడుతూ…డీఎంకేలో స్టాలిన్‌ జిల్లా కార్యదర్శి నుంచి అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. దీని ద్వారా పెళ్లై 9 నెలల తర్వాత సరైన పద్ధతిలో స్టాలిన్‌ జన్మించారని చెప్పవచ్చన్నారు. అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన పళనిస్వామి.. అకాల శిశువుగా జన్మించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి పళనిస్వామి.. గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తూ కన్నుమూసిన తన తల్లిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని కంటతడి పెట్టారు. భగవంతుడు వారికి తగిన శిక్ష వేస్తాడని చెన్నైలోని తిరువత్తియూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా పళనిస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు. అటు, నేర విభాగ పోలీసులు ఎంపీ రాజాపై కేసు నమోదు చేశారు. ఇక, డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా గౌరవప్రదమైన విమర్శలు మాత్రమే చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇక, తన తల్లిని కించపరిచారని కంటతడి పెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డీఎంకే ఎంపీ ఎ.రాజా క్షమాపణలు చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. సీఎం పళనిస్వామి కంటతడి పెట్టడం బాధించిందని రాజా చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా దూషించడం తన ఉద్దేశం కాదని, ఇద్దరి రాజకీయ జీవితాల గురించి మాత్రమే పోల్చి మాట్లాడానని రాజా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు.