ఎండ్ ఆఫ్ గుడ్ టైమ్స్…ఈ రాత్రికే భారత్ కు విజయ్ మాల్యా!

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 03:17 PM IST
ఎండ్ ఆఫ్ గుడ్ టైమ్స్…ఈ రాత్రికే భారత్ కు విజయ్ మాల్యా!

ఎట్టకేలకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు తీసుకొస్తున్నారు అధికారులు. ఇఫ్పటికే బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అక్కడి కోర్టులను ఒప్పించిన భారత సర్కార్.. మాల్యాను ఈ రాత్రికి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తయిందని, ఆయన్ను ఏ క్షణమైనా భారత్ తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి.

భారతీయ బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మార్చి-2,2016న లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను ఈడీ,సీబీఐ అధికారులు ఇవాళ(జూన్-3,2020)రాత్రి ముంబైకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.

కాగా, ఇవాళ రాత్రి ముంబై చేరుకున్న తర్వాత మాల్యా ముంబైలోని సీబీఐ ఆఫీస్ లో  కొంత సమయం ఉండనున్నారు. ఈడీ,సీబీఐలు మాల్యాను కస్టడీకి కోరే అవకాశముంది. 2019లో భారత ప్రభుత్వం…మాల్యాను పారిపోయిన ఆర్థికనేరస్థుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  

2018 ఆగస్టులో మాల్యా అభ్యర్ధన విన్నబ్రిటన్ కోర్టు…అతన్ని అప్పగించిన తర్వాత ఉంచనున్న జైలు వివరాలను తెలియజేయాలని భారత దర్యాప్తు సంస్థలను కోరింది. మాల్యాను అప్పగిస్తే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని ఓ సెల్ లో ఉంచుతామని ఆ గది యొక్క వీడియోను కోర్టుకి చూపించాయి భారత దర్యాప్తు సంస్థలు. అక్కడ వారు మాల్యాను అప్పగించిన తరువాత ఉంచాలని భారత దర్యాప్తు సంస్థలు ప్లాన్ చేశాయి. ఇప్పుడు మాల్యా..ఇదే జైలు గదిలోకి రానున్నట్లు తెలుస్తోంది.