Uddhav Thackeray: బాల్థాకరే పేరుతో ఫడ్నవీస్ ఓట్లు అడుగుతున్నాడంటే.. మోదీ శకం ముగిసినట్లే: ఉద్ధవ్ థాకరే
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ పేరుతో కాకుండా బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. త్వరలో ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
Uddhav Thackeray: బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్.. బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలోని శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రభుత్వం త్వరలో కీలకమైన ఎన్నికల్ని ఎదుర్కోబోతుంది. ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ముంబైకి సంబంధించి ఎన్నికల్లో గెలిచి, బాల్థాకరే కలను నెరవేర్చడం తమ ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్.. మోదీ పేరుతో కాకుండా, బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడని, దీన్నిబట్టి మోదీ శకం ముగిసినట్లే అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. శనివారం ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ-షిండే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘దేవేంద్ర ఫడ్నవీస్ బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడు. దీన్నిబట్టి మోదీ శకం ముగిసినట్లే అని అర్థమవుతోంది.
ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతం ప్రకారం.. ఓట్లు అడిగేందుకు ఆ పార్టీకి ఒక కొత్త పేరు కావాలి. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ అసలైన రంగును బయటపెట్టాడు’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘బాల్థాకరే కలల్ని ఆయన వారసులు నెరవేర్చకుంటే… ఆయనను గౌరవించే వాళ్లె నెరవేర్చకూడదా? బాల్థాకరే కలల్ని వేరేవాళ్లు నెరవేరుస్తున్నందుకే ఆయన వారసులకు కోపం’’ అని బీజేపీ వ్యాఖ్యానించింది.