భారత్ లో పెరుగుతున్న కరోనా స్ట్రెయిన్ కేసులు..యూకే నుంచి వచ్చిన మరో ఐదుగురికి సోకినట్లు గుర్తింపు
Increasing corona strain cases in india : భారత్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ కేసులు 25 కు చేరాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసులను నిర్ధారించారు. పూణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో కొత్త నాలుగు కేసులు, ఢిల్లీలోని ఐజీఐబీలో మరో కేసు నమోదు అయ్యింది.
అయితే యూకే వేరియంట్లో పాజిటివ్ తేలిన 25 మందిని ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా స్ట్రెయిన్ సోకిన వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వార్డుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా స్ట్రెయిన్ సోకినవారి కాంటాక్ట్స్ గుర్తించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది.
మరో వైపు గత 24 గంటల్లో 21,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా స్ట్రెయిన్ విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జనవరి ఏడో తేదీ వరకు పొడిగించారు. ఇటీవల యూకేలో కరోనా స్ట్రెయిన్ ఆనవాళ్లు కనిపించిన తర్వాత ఆ దేశంతో అనేక దేశాలు ట్రావెల్ సంబంధాలు తెంచుకున్నాయి. యూరప్లోని కొన్ని దేశాలు తమ సరిహద్దుల్ని కూడా మూసివేశాయి. ఇండియాలో ఇప్పటికే యూకే విమానాలను బ్యాన్ చేశారు.