మే-1న భారత్ కు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్
Russia vaccine ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అతి త్వరలో దేశానికి రానుంది. స్పుత్నిక్ వి- తొలి బ్యాచ్ టీకా డోసులు మే 1న భారత్కు చేరుకోనున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రివ్ సోమవారం తెలిపారు. వేసవి చివరినాటికి భారత్లో నెలకు 50 మిలియన్ డోసుల చొప్పున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.
భారత్లో కరోనా మహమ్మారి సునామీ వేగంతో విజృంభిస్తోన్న వేళ..వ్యాక్సిన్లను రష్యా పంపడం కొంత ఊరటనిచ్చే అంశం. కాగా, ఇండియాలో ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండగా..మే 1 వ తేదీ నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానున్నది.
కాగా, “స్పుత్నిక్ వి”వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గతవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)అనుమతిచ్చిన విషయం తెలిసిందే. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు డా. రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన రెడ్డీస్.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్లో స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.