ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు సిద్దం
Indian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తుతం దీని ప్రధాన ఆర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను గురువారం(ఫిబ్రవరి-25,2021) రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
అద్భుత కట్టడం సిద్ధమవుతోంది.. మరో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులు వేస్తోందని పియూష్ గోయల్ తన ట్వీట్ లో తెలిపారు. 476 మీటర్ల పొడువైన స్టీల్ ఆర్క్ను పియూష్ షేర్ చేసిన ఫొటోలో చూడొచ్చు. కశ్మీర్ను మిగతా దేశంతో కలిపే రైల్వే ప్రాజెక్ట్లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
2017 నవంబర్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దీనికి రూ.1250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు. ఇది ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఎత్తు కంటే కూడా 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడువు 1315 మీటర్లు.