హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన బాలిక..బిడ్డను బకెట్లో పడేసింది…
చదువుకోవటానికి వచ్చిన బాలిక బాత్రూమ్లో ప్రసవించింది. పుట్టిన బిడ్డను అక్కడే ఉన్న బకెట్లో పడవేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో చోటు చేసుకుంది. ధూలే జిల్లాలోని సాక్రి పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఆదివాసీ హాస్టల్లో ఫిబ్రవరి 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న 18ఏళ్ల బాలిక హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించింది. కంగారు పడి పుట్టిన పసికందును అక్కడే ఉన్న బకెట్లో పడేసి బైటకెళ్లిపోయింది.
కానీ ఆ బిడ్డ చనిపోలేదు. ఏడ్చింది. ఆ ఏడుపులు విన్న హాస్టల్ వార్డెన్ బాత్రూమ్లోకి వెళ్లి చూడగా..బకెట్లో పసికందు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. దీంతో వార్డెన్ ఆశ్చర్యపోయింది. వెంటనే హాస్టల్లో ఉండే బాలికలందరినీ పిలిచి వరుసగా నిలబెట్టి..ఈ పనిచేసింది ఎవరు? అని ప్రశ్నించింది. బాలికల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు వెంటనే వచ్చి విచారణ చేపట్టారు. బాలికలందరినీ మరోసారి అడిగినా ఫలితంలేదు. ఎవరి నుంచి సమాధానం రాలేదు. వెంటనే పోలీసులు వైద్య పరీక్షలు చేయించటంతో పసిబిడ్డ తల్లిని కనిపెట్టారు.
దీనిపై సాక్రీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవీదాస్ మాట్లాడుతూ..వైద్య పరీక్షల తరువాత బిడ్డను ప్రసవించిన బాలికను తెలుసుకున్నామనీ..ప్రస్తుతం సదరు బాలిక (తల్లి)ను పుట్టిన బిడ్డను వైద్యం నిమిత్తం హాస్పిటల్ కు తరలించామని తెలిపారు. ఈ కేసులో చదువుకోవటానికి వచ్చిన బాలిక తల్లి కావాటానికి కారణం ఎవరు? ఎవరన్నా మాయ మాటలు చెప్పి మోసం చేశారా? లేక ఎవరైనా అత్యాచారం చేయటం వల్ల బాలిక గర్భం ధరించిందా? వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.