స్మశానంలో కరోనా మృతదేహాన్ని పీక్కుతింటున్న వ్యక్తి
సాధారణంగా కోవిడ్ రోగిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు.
Maharashtra సాధారణంగా కోవిడ్ రోగిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇక కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించడానికి కూడా ఎవరూ సాహసించడంలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కుతిన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో జరిగింది.కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత బుధవారం ఉదయం సతారా జిల్లాలోని కోలకి గ్రాయ పంచాయతీ శ్మశాన వాటికలో ఓ మతి స్థిమితం లేని యువకుడు కనిపించాడు. అతడు శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను తింటున్నట్లు స్థానికులు గమనించారు.ఈ ఘటనలో స్థానికులు భయభ్రాంతులు గురయ్యారు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఆ వెంటనే ఫల్టాన్ మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వచ్చేలోగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా సాయంత్రానికల్లా అధికారులు అతడిని వెతికి పట్టుకోగలిగారు.
అయితే సదరు వ్యక్తి ప్రవర్తనను బట్టి అతనికి మతిస్థిమితం సరిగా లేదనిపిస్తోందని అధికారులు గుర్తించారు. అతడు హిందీ మాట్లాడుతున్నాడని.. పేరు, ఊరు వివరాలు చెప్పడం లేదని అధికారులు వివరించారు. మతిస్థిమితం లేకే మృతదేహాలను తిని ఉండవచ్చని చెప్పారు. అతడిని మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించామని,మెడికల్ రిపోర్టులు వచ్చిన అనంతరం ఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.