ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ ఏకైక అస్త్రం

ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ ఏకైక అస్త్రం

భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసి ఉండొచ్చనీ వ్యాఖ్యానించాడు.  

కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750ట్రక్కుల ఆపిల్స్ ఎగమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించాడు. ఆర్టికల్ 370రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిని ఖండించారు. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని వివరించారు.

‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్ లోని ఉగ్రవాదులతో పాక్ లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ.. అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయి. వాటిని మీరు ఆపలేరా. చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు.