Chirag Paswan : ఎల్జేపీలో తిరుగుబాటు..చిరాగ్ పై నితీష్ రివేంజ్?
బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది.
Chirag Paswan బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. చిరాగ్ పాశ్వాన్ కలిపి మొత్తం ఆరుగురు ఎంపీలున్న LJPలో…ఐదుగురు ఎంపీలు లోక్సభాపక్ష నేతగా చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ ను ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడే ఈ పశుపతి కుమార్ పరాస్.
గత ఏడాది తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుంచి చిరాగ్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. ఆయన పనితీరు పట్ల ఈ ఐదుగురు ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి ఉన్న సామర్థ్యం ఈయనకు లేదని వీరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
అయితే, ఇదంతా జేడీయూ పన్నిన పన్నాగమే అని చిరాగ్ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. తమ పార్టీలో అసమ్మతి వెనుక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హస్తం ఉందని చిరాగ్ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణం తర్వాత బిహార్లో ఎన్డీఏ నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకొచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసి.. నితీశ్ పార్టీని పరోక్షంగా దెబ్బకొట్టారు. దీంతో అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తోన్న నితీశ్ కుమార్.. ఎల్జేపీలో చీలిక తెచ్చి చిరాగ్పై ప్రతీకారం తీర్చుకున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పరాస్కు కేంద్ర క్యాబినెట్ పదవి ఇప్పిస్తానని నితీశ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక, తమను లోక్ సభలో వేరుగా గర్హించాలని కోరుతూ ఐదుగురు ఎల్జేపీ రెబల్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి విజ్ణప్తి చేశారు. పశుపతి కుమార్ పరాస్ ను తమ పార్టీ నేతగా చేయాలని స్పీకర్ ను కోరారు. తమ రాష్ట్ర రాజకీయ తాజా పరిణామాలను కూడా వివరిస్తూ స్పీకర్ కు వీరు ఓ లేఖలో సమర్పించారు. చిరాగ్ పాశ్వాన్ ను తమ లీడర్ గా తొలగించాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు, ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి ఢిల్లీలోని పశుపతి కుమార్ పరాస్ ఇంటికి సోమవారం చిరాగ్ పాశ్వాన్ వెళ్లారు. పాసవాన్ సోదరుడు మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అక్కడే ఉన్నారు. అయితే గంట 45 నిమిషాల పాటు ఇంటి వద్దే కారులో కూర్చొన్న పాశ్వాన్ ను.. పరాస్ ఇంట్లోకి ఆహ్వానించేదు. దీంతో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పాశ్వాన్ తిరిగి వెళ్లిపోయాడు.