No Mixing Of Vaccines : రెండు డోసులు ఒకే వ్యాక్సిన్..కేంద్రం క్లారిటీ
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
No Mixing Of Vaccines దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దాని ప్రభావంపై తగిన శాస్త్రీయ ఆధారాలు లభించే వరకు దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ డోసుల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రెండు డోసులకు ఒకే వ్యాక్సిన్ను ఇస్తారని స్పష్టంచేసింది.
కోవిషీల్డ్ సెకండ్ డోసుని తొలగించడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చంటూ సీనియర్ అధికారులు కొందరు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో…కోవిషీల్డ్ డోసుల షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పౌల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కొవిషీల్డ్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత 12 వారాలకు అదే వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తారని తెలిపారు. అదేవిధంగా, కొవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాలకు అదే వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తారని తెలిపారు. లబ్ధిదారులందరికీ రెండు డోసుల కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ లభిస్తాయని తెలిపారు.
అయితే వ్యాక్సిన్ల మిక్సింగ్ సాధ్యామా లేదా అన్న దానిపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన జరుగుతున్నదని, దానివల్ల హానికర రియాక్షన్స్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అది ఒక పరిష్కారం లేని శాస్త్రీయ ప్రశ్న అని, దానికి సైన్సే సమాధానం చెబుతుందని తెలిపింది.
ఇక,ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత లేదని ఐసీఎంఆర్ డైరక్టరం జనరల్ బలరామ్ భార్గవ అన్నారు. జులై మధ్య నాటికి లేదా ఆగస్టు నాటికి రోజుకి 1కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు తగినన్ని డోసులను కలిగి ఉంటామన్నారు. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా దేశంలో మొత్తంగా 21.60కోట్ల మందికి వ్యాక్సిన్ అందించగలిగామన్నారు.