రాజస్తాన్ సీఎం దంపతులకు కరోనా..త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్ష
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని గురువారం సీఎం అశోక్ గెహ్లాట్ ఓ ట్వీట్ లో తెలిపారు.
కాగా,బుధవారం సీఎం గెహ్లాట్ భార్య సునీతకి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో బుధవారమే ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు సీఎం గెహ్లాట్. ఈరోజు కరోనా టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్గా తేలిందని..అయితే రోగ లక్షణాలేవీ లేవని సీఎం చెప్పారు. ఐసోలేషన్లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్,ఆయన భార్య సునీత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.