నో కాంప్రైమైజ్ : అక్రమ నిర్మాణమని తేలితే..మత కట్టడమైనా కూల్చేయండి
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులను ఆక్రమించి నిర్మించిన అన్ని మతపరమైన కట్టడాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Roadside religious structures : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులను ఆక్రమించి నిర్మించిన అన్ని మతపరమైన కట్టడాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు పంపించారు. రకరకాల కారణాలు చెప్పి రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల రోడ్లు కుచించుకుపోతున్నాయి. తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. పైగా మతపరమైన కట్టడాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తుండటంతో… రోజుకో చోట ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి.
దీంతో యోగి సర్కార్ అ అక్రమాలపై నజర్ పెట్టింది. కట్టడాలను కూల్చే విషయంలో ఎటువంటి పక్షపాతం చూపొద్దని.. అక్రమ నిర్మాణమని తేలితే ఏ మత కట్టడమైనా కూల్చేయాలంటూ తేల్చి చెప్పారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన మతపరమైన కట్టాల కూల్చి వేతకు మీన మేషాలు లెక్కించడం లేదు యోగి సర్కార్. మార్చి 11న ఆదేశాలు జారీ చేయగా… కూల్చి వేతలకు కేవలం రెండు రోజుల గడువే ఇచ్చింది. మండలాల వారీగా ఎక్కడ ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేశారనే వివరాలను మార్చి 14 కల్లా తనకు అందివ్వాలంటూ కలెక్టర్లను గట్టిగా ఆదేశించారు. రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికార యంత్రాగం రెడీ అవుతోంది. ఆగమేఘాల మీద కూల్చి వేతలకు అవసరమైన సరంజామ సమకూర్చుకుంటోంది.