ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి మరో 22 ప్రత్యేక రైళ్లు
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న రైళ్లలో సికింద్రాబాద్- విశాఖ గరీబ్ రథ్ (12739), సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్(12800), సికింద్రాబాద్-యశ్వంత్పూర్ ఎక్స్ ప్రెస్ (12735), కాచిగూడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ (17252) రైళ్లు ఉన్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పునరుద్దరణ:
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో క్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
దశల వారీగా పునరుద్దరణ:
కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వేలో రోజుకు 291 ఎక్స్ప్రెస్ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రత్యేక రైళ్ల పేరిట ఇప్పటి వరకు 170 రైళ్లను పునరుద్దరించారు. ప్రత్యేక రైళ్ల పేరిట దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవాలి:
ఔరంగాబాద్-రేణిగుంట, నాందేడ్-హజ్రత్ నిజాముద్దీన్, జియవాడ-షిర్డీ, నాందేడ్-సంత్రాగచి, నాందేడ్-ఔరంగాబాద్, నాందేడ్-శ్రీగంగానగర్ రైళ్లు కూడా మళ్లీ పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇవన్నీ ప్రత్యేక రైళ్లు. టికెట్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ టికెట్లకు కూడా ముందుస్తు రిజర్వేషన్ తప్పనిసరి. టికెట్లు ఉన్న వారినే రైల్వే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు.