అమర జవాన్ భార్య ఆగ్రహం : ఫేస్ బుక్ లో కాదు సైన్యంలో చేరి యుద్ధం చెయ్యండి
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి నినాద్ మందవ్ గేన్ భార్యే విజేత. నినాద్ అంత్యక్రియలను మహారాష్ట్రలోని నాసిక్ లో శుక్రవారం మిలటరీ లాంఛనాలతో ముగిశాయి. ఆదివారం(మార్చి-3,2019) మీడియాతో మాట్లాడిన విజేత.. సోషల్ మీడియాలో పాకిస్థాన్ తో యుద్ధం చేయాలని కోరేవాళ్లను తప్పుబట్టింది.యుద్ధం వల్ల ఏ ప్రయోజనం చేకూరదని, యుద్ధం జరగాలని అంతగా కోరుకుంటే సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధభూమిలో నిలబడాలని సూచించింది.
సోషల్ మీడియా యూజర్లు.. దయచేసి నిగ్రహాన్ని పాటించాలని, అనవసరంగా మనోభావాల్ని రెచ్చగొట్టొద్దని ఆమె కోరారు. మీడియాపై కూడా ఈ సందర్భంగా ఆమె విమర్శలు చేశారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీల్లో చాలా జరుగుతుంటుందని, మీడియా ఒక్కోసారి బాధ్యాతాయుతంగా ఉన్నట్లు నటిస్తుందని, ఒక్కోసారి అలా కూడా జరగదని, నిజంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నట్లైతే నినాద్, అభినందన్ లాగానే సైన్యంలో చేరిపోండి. లేదంటే మీ పిల్లల్ని చేర్చండి. అది కూడా చేయలేకపోతే మీ చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ వహించంది. రోడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.