స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన, హీరో రామ్కు ACP వార్నింగ్
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలన రేపిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఎంట్రీతో మరింత హీటెక్కింది. రామ్ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. సీఎం జగన్ ను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రామ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై రామ్ మరోసారి ట్వీట్ చేశారు. ”నేను జస్టిస్ ను నమ్ముతాను, నిజమైన నేరస్తులకు శిక్ష పడుతుందని అనుకుంటున్నా” అని అన్నారు. అంతేకాదు ఇకపై ఈ విషయంపై ట్వీట్ చేయనని రామ్ చెప్పారు.
I believe in Justice and im sure the real culprits will be punished no matter who they are.. related or not..I won’t be tweeting about this anymore as I’ve said all I had to..
Jai Hind! ?
— RAm POthineni (@ramsayz) August 16, 2020
రామ్కు అవగాహన లేదు, ఆధారాలు ఉంటే ఇవ్వండి:
కాగా, విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు రామ్ ట్వీట్లపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రామ్ కు వార్నింగ్ ఇచ్చారు. తమ విచారణకు ఆటంకం కలిగించాలని చూస్తే నోటీసులు ఇస్తామన్నారు.” స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటివరకు మాకు చూపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే హీరో రామ్ మాకు సమర్పించాలి. దీనిపై ఆయనకు అవగాహన లేదని అనిపిస్తోంది. అసలు క్వారంటైన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు. విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్ కు నోటీసులు ఇస్తాము” అని ఏసీపీ హెచ్చరించారు.
ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని విద్యుత్ లోపాలు సరి చేయలేదు:
స్వర్ణ ప్యాలెస్ లో ఆగస్టు 9వ తేదీన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు మరణించారు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ జరిపిన దర్యాఫ్తు బృందం 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. రమేష్ హాస్పిటల్స్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే.. అగ్నిప్రమాదం జరిగిందని రిపోర్టులో చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు విషయమై రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని రిపోర్టులో తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నాయని, ఆ విషయం రెండు యాజమాన్యాలకు తెలుసని, కానీ వాటిని సరిచేయటానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని దానిని పట్టించుకోలేదని తేల్చారు.
విద్యుత్ లోపాలు ఉన్నాయని తెలిసినా కొవిడ్ కేర్ సెంటర్ తెరిచారు:
దాని వల్లనే… అగ్నిప్రమాదం జరిగిందన్నారు. లోపాలు ఉన్నాయని తెలిసినా రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ ను తెరిచిందని, ఫలితంగా 10మంది చనిపోయారని, 20మంది గాయపడ్డారని రిపోర్ట్ లో తెలిపారు. విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో లోపాలు ఉన్నాయని తెలిసినా కోవిడ్ కేర్ సెంటర్ ను నడిపిన రమేష్ హాస్పిటల్స్ దే బాద్యతని రిమాండ్ రిపోర్ట్ తేల్చింది. ఎమ్ఓయూలు కుదర్చుకోవడంలో చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావు, జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్ పాత్ర ఉందని తేల్చారు. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించటానికి ఎలాంటి భద్రత చర్యలు తీసుకొలేదని, ముగ్గురు నిందితులు బయటకు వస్తే… ఆధారాలను తారుమారు చేయడంతో పాటు పరారైయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదానికి రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలదే బాధ్యతగా నిర్ధారించారు.